మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా

  • టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే రాజీనామా
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
  • పార్టీ పాలనలో అవినీతి, వైఫల్యాలే రాజీనామాకు కారణమని వెల్లడి
  • మమత ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కీలక నేత పార్టీని వీడటం గమనార్హం
  • 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే సోమవారం తన ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, 2011 నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించిన సుఖేందు నిష్క్రమణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సోమవారం పార్లమెంటుకు చేరుకున్న సుఖేందు శేఖర్, తన రాజీనామా లేఖను సమర్పించారు. అదేవిధంగా పార్టీని వీడుతున్నట్లు తెలుపుతూ అధినేత్రి మమతా బెనర్జీకి కూడా రాజీనామా లేఖను అందజేశారు. టీఎంసీ పాలనలో పెచ్చరిల్లిన అవినీతి, మహిళల భద్రతలో వైఫల్యం, విద్య, ఆరోగ్య వంటి కీలక రంగాల్లో వెనుకబాటుతనం వంటి అంశాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును గౌరవిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌లో నూతనంగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేయడాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని, 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుఖేందు రాజీనామా, రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని రాజీనామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే సంకేతాలిస్తోంది. విపక్ష 'ఇండియా' కూటమి సమావేశం కోసం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Sukhendu Sekhar Ray
Mamata Banerjee
Trinamool Congress
West Bengal Politics
Rajya Sabha Resignation

More Telugu News